నాగారం, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ బాలాజీనగర్ కాలనీలో గత నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకపోవడంతో గురువారం కాలనీవాసులు ధర్నాకు దిగారు.
సామాజిక కార్యకర్త అక్కల సురేష్ కుమార్ కాలనీవాసులతో కలిసి ధర్నాలో పాల్గొని, ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి, జలమండలి అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పైప్లైన్ బ్లాకేజీని తొలగించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
నాలుగు నెలలుగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రజాపాలన ఇదేనా?” అంటూ ప్రశ్నించారు. తాగునీరు ప్రజల ప్రాథమిక అవసరమని, ఇకనైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకుని బాలాజీనగర్లో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.




